06/01/2026
*హనీ ట్రాప్ల వలలో పడుతున్న సమాజం* డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ | సెక్స్ ఎడ్యుకేటర్ | క్లినికల్ న్యూట్రిషనిస్ట్ & డైటీషియన్ | స్పెషల్ ఎడ్యుకేటర్ | ఫ్యామిలీ కౌన్సెలర్, 9703935321
*మౌనమే నేరగాళ్లకు అతిపెద్ద ఆయుధం*
డిజిటల్ విప్లవం మన జీవనశైలిని సౌకర్యవంతంగా మార్చింది. దూరాలు తగ్గాయి, అవకాశాలు పెరిగాయి, భావాల వ్యక్తీకరణ సులభమైంది. కానీ అదే సమయంలో డిజిటల్ వేదికలు సైబర్ నేరగాళ్లకు, బ్లాక్మెయిల్ గ్యాంగ్లకు, హనీ ట్రాప్ మాఫియాలకు స్వర్గధామాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు అరుదుగా వినిపించిన హనీ ట్రాప్ కేసులు నేడు సాధారణ వార్తలుగా మారడం మన సమాజానికి హెచ్చరిక.
ఒక్క క్లిక్… ఒక జీవిత మలుపు
ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ–సామాజిక ప్రముఖులు, విద్యార్థులు, యువత, కుటుంబ పెద్దలు—
వయస్సు, వృత్తి, స్థాయి ఏదైనా సరే, ఒక్క తప్పు క్లిక్తో జీవితం తలకిందులు అవుతోంది. తెలియని ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించడం, అనుమానం లేకుండా చాట్ చేయడం, నమ్మకం పేరుతో వ్యక్తిగత విషయాలు పంచుకోవడం చివరికి పరువు, భవిష్యత్, కుటుంబాన్ని ప్రమాదంలో పడేస్తోంది.
హనీ ట్రాప్: ప్రేమ కాదు – పూర్వ ప్రణాళికతో చేసిన నేరం
హనీ ట్రాప్ అనేది ఆకర్షణ, ప్రేమ, స్నేహం అనే ముసుగులో జరిగే పథకబద్ధమైన డిజిటల్ నేరం. అందమైన అమ్మాయి లేదా అబ్బాయి పేరుతో నకిలీ ప్రొఫైల్లు సృష్టించి, బాధితుడి మనస్తత్వాన్ని అధ్యయనం చేసి, నమ్మకం పెంచుకుంటారు. ఆ తరువాత వీడియో కాల్స్, ఫోటోలు, స్క్రీన్ రికార్డింగ్స్ ద్వారా వ్యక్తిగత క్షణాలను ఆయుధాలుగా మార్చి బ్లాక్మెయిల్ ప్రారంభిస్తారు. ఇది భావోద్వేగం కాదు, ఇది కచ్చితమైన దోపిడీ వ్యూహం.
భయంతో మొదలయ్యే బానిసత్వం
హనీ ట్రాప్లో చిక్కుకున్నవారు ఎక్కువగా భయంతోనే నేరగాళ్ల మాటలకు లోబడతారు. పరువు పోతుందన్న ఆందోళనతో పోలీసులకు చెప్పకుండా మొదట చిన్న మొత్తం, తరువాత పెద్ద మొత్తాలు పంపుతారు. కానీ ఒక్కసారి డబ్బు పంపారంటే బ్లాక్మెయిల్ ఎప్పటికీ ఆగదు. మోసమే వారి వ్యాపారం, భయం వారి మూలధనం.
సోషల్ మీడియానే ప్రధాన వేటస్థలం
గణాంకాలు చెబుతున్న నిజం ఏమిటంటే, హనీ ట్రాప్ కేసులలో దాదాపు తొంభై శాతం సోషల్ మీడియా నుంచే మొదలవుతున్నాయి. ఈ నేరాలు ఒంటరి వ్యక్తుల పని కాదు. టీమ్లుగా పనిచేస్తూ, బాధితుడి ఆర్థిక స్థాయిని అంచనా వేసి డిమాండ్లను రూపొందిస్తారు. టెక్నాలజీ అవగాహన లోపం, ఆన్లైన్లో భావోద్వేగాలను వెతకడం నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది.
మౌనం ఎందుకు ప్రమాదకరం?
ఎక్కువ మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. అదే నేరగాళ్లకు అతిపెద్ద బలం. మౌనం వల్ల నేరగాళ్లు ధైర్యం పెంచుకుంటారు, మరింత మందిని లక్ష్యంగా చేసుక